janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 12:18 pm Digital Edition : GATTU MAHESH

రూ.2000 నోట్లపై ఆర్బీఐ కొత్త ప్రకటన‌.

రూ.2000 నోట్లపై ఆర్బీఐ కొత్త ప్రకటన‌.

జనం వాయిస్ వెబ్, న్యూఢిల్లీ:

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత విలువైన కరెన్సీగా పరిచయమైన రూ.2000 నోట్లు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన ప్రకటనతో ఈ పెద్ద నోట్లపై మరోసారి చర్చ మొదలైంది.2016 నవంబర్‌లో జరిగిన నోట్ల రద్దు అనంతరం రూ.2000, రూ.500 నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ పెద్ద నోట్ల అవసరం తగ్గిపోవడంతో 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. అప్పటి వరకు మార్కెట్లో దాదాపు రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని పేర్కొంది.గడిచిన రెండేళ్లలో ఆ నోట్లు దాదాపు అన్నీ బ్యాంకులకు తిరిగి వచ్చాయి. కానీ తాజాగా విడుదల చేసిన ఆర్‌బీఐ నివేదిక ప్రకారం, ఇప్పటికీ ప్రజల వద్ద రూ.5,817 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని వెల్లడించింది. అంటే మొత్తం నోట్లలో 98.37 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరగా, మిగిలిన 1.63 శాతం నోట్లు ఇంకా మార్కెట్లో, లేదా వ్యక్తుల వద్దే ఉన్నట్లు అర్థమవుతోంది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆర్‌బీఐ నోటీసు ఇచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఈ నోట్లు పూర్తిగా తిరిగి రాకపోవడం. కొందరు ఈ నోట్లు అనుకోకుండా ఇళ్లలో ఉంచి మర్చిపోయి ఉండవచ్చు, మరికొందరు స్మారకంగా దాచుకున్నట్లు సమాచారం.ఇంకా ఈ నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఆందోళన అవసరం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టంగా తెలిపింది – రూ.2000 నోట్లను ఇప్పటికీ మార్చుకునే అవకాశం ఉంది. అందుకోసం మీరు హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం లేదా సమీప రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. నోట్లను సమర్పిస్తే, అంతకు సమానమైన మొత్తం మీ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది.అదే కాకుండా, స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా కూడా ఈ నోట్లు పంపి మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షితమని, డబ్బులు మీ ఖాతాలోనే జమ అవుతాయని అధికారులు తెలిపారు.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్ద నోట్ల చలామణి తగ్గడం ద్రవ్యప్రసరణ నియంత్రణకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. అయినా కూడా, ప్రజల వద్ద ఇంకా వేల కోట్ల రూపాయల విలువైన రూ.2000 నోట్లు ఉండటం ఆర్థిక వ్యవస్థలో ఆశ్చర్యకర అంశంగా మారింది.దేశవ్యాప్తంగా మళ్లీ రూ.2000 నోట్లపై చర్చ మొదలవగా, ఆర్‌బీఐ తాజా గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి.