స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.
-పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్ రెడ్డి.
-గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవగాహన సదస్సు.
జనం వాయిస్, ముత్తారం, పెద్దపల్లి:
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాం రెడ్డి సూచించారు.పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి,ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి బి.రామ్ రెడ్డి,గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు యువత కు ప్రత్యేకంగా ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి అందరూ పోలీస్ వారికీ సహకరించాలని సూచించారు.ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, ప్రచారాల సమయంలో, పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నిషేధిత చర్యలు, డబ్బు/మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు.ఎలాంటి అక్రమ చట్ట వ్యతిరేకమైన,ఎన్నికల ఉల్లాంఘాన చర్యలు జరిగిన వెంటనే డయాల్ 100, స్థానిక పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడడం చేయకూడదు అన్నారు.అభ్యర్థులు, మద్దతుదారులు శాంతి భద్రతలను కాపాడుతూ ఎన్నికల చట్టాలను గౌరవించాలి అని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా హానికరమైన ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు షేర్ చేసిన కూడా బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని.. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు.డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,మంథని సీఐ బి. రాజు, ముత్తారం ఎస్ ఐ రవి కుమార్,పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.