ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు..
– విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం.
జనం వాయిస్, న్యూఢిల్లీ – జనవరి 2:
దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. దీంతో దృశ్యమానత భారీగా పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విజిబిలిటీ తగ్గిపోవడంతో పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పొగమంచు పరిస్థితులు తీవ్రమవడంతో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. విమానాలు రద్దైన ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చని, అవసరమైతే రుసుము వాపసు పొందవచ్చని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో రైలు రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం శుక్రవారం ఉదయం నగరంలో గాలి నాణ్యత సూచిక 386గా నమోదైంది. నగరంలోని 26 గాలి పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణ స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 423గా నమోదై పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పొగమంచుతో పాటు కాలుష్యం పెరగడంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.