ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం: ప్రత్యేక ఆకర్షణగా ‘పాదయాత్ర’ బంధువుల సందడి.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
నాడు పాదయాత్రలో తోడుగా నడిచిన ఆదివాసీ మహిళలకు ప్రత్యేక ఆహ్వానం…
పాత అనుబంధాన్ని మరువని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటు చేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్న ఈ వేడుకలో… నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అడవి బిడ్డలతో అనుబంధం…
గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, అలాగే ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి పాల్గొన్నారు.
పాదయాత్ర అంతా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, ఎండ తీవ్రతలో భట్టి విక్రమార్క గారు అలసిపోకుండా, వారి ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు.
మరువని కృతజ్ఞత.. పెళ్లి పీటలపై గౌరవం…
పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి విక్రమార్క గారు, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించడం అక్కడి అతిథులందరినీ ఆకట్టుకుంది.