janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 10:09 pm Digital Edition : GATTU MAHESH

తెలంగాణలో జనసేన కమిటీల రద్దు – తాత్కాలిక కమిటీల నియామకం.

తెలంగాణలో జనసేన కమిటీల రద్దు – తాత్కాలిక కమిటీల నియామకం.

– క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.
– గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా విభాగాల కమిటీల రద్దు.
– ముప్పై రోజుల పాటు తాత్కాలిక కమిటీల పని.

జనం వాయిస్, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలిక కమిటీలను నియమించనున్నారు. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కమిటీలు, వీరమహిళ విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక కమిటీలు ముప్పై రోజుల పాటు పనిచేస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాత్కాలిక కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు వందల వార్డుల్లో పర్యటించనున్నారు. ప్రతి ప్రాంతం నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావడం వారి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటిస్తామని జనసేన నాయకత్వం స్పష్టం చేసింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.