వైద్యులే నిజమైన స్నేహితులు – ఆళవందార్ వేణు మాధవ్.
జనం వాయిస్, ఘట్కేసర్, ఆగస్టు 02:
ప్రపంచంలోని అన్ని బంధాల కంటే స్నేహబంధమే గొప్పదని, వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రాణాలను నిలబెట్టే వైద్యులు, వైద్య సిబ్బందే నిజమైన స్నేహితులని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ అన్నారు. ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చౌదరిగూడ ఓయూ కాలనీలో ఉన్న సురవి హాస్పిటల్లో డాక్టర్ కె. ప్రవీణ్కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ, ఆస్తులు, అంతస్తులు, హోదా, ధనం కంటే స్నేహానికి ఎంతో విలువ ఉందన్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు–కుచేలుడు స్నేహం, దుర్యోధనుడు–కర్ణుడు మైత్రి స్నేహబంధం గొప్పతనాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కంచె బీరయ్య, ఎం.డి. రఫిక్, ఏ. ప్రభాకర్, వైద్య సిబ్బంది శ్రావణి, ఫిజియోథెరపిస్టు మునీరా ఖుదుసా, సంధ్య, శివాని తదితరులు పాల్గొన్నారు.