ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ.
జనం వాయిస్, పెద్దపల్లి:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టడానికి, కమలా ఫౌండేషన్ అధ్యక్షుడు పాఠశాల ఆంగ్లోపాధ్యాయుడు సాదుల వెంకటేశ్వర్లు నిత్యవసర వంట సరుకులను వంట కార్మికులకు మంగళవారం అందించారు.పెద్దపల్లి మండలంలోని మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి, గత జూలై నుండి డిసెంబర్ వరకు నిరాటంకంగా ఆరు మాసాలుగా ఐదు లీటర్ల గోల్డ్ డ్రాప్ రిఫండ్ ఆయిల్, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, అల్లం, ఆలుగడ్డలు, అయోడైజ్డ్ ఉప్పు, కంది, శనగ, పెసరపప్పులు మొదలగు వంట సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.ఏ నెలకు ఆ నెల సరిపోయేటట్టు వంట సరుకులను సమకూరుస్తూ, పలువురి ప్రశంసలందుకుంటున్నాడు.ఈ వంట వస్తువుల వితరణ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంకతి సంజీవ్, కూకట్ల తిరుపతి, లోకిని సదానందం, మానుపాటి రాజన్న, బాదం జ్యోతి, గర్రెపల్లి రమ, జూపాక రజిత, కాంపెల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తన తల్లి పేరున ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ కమల ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న ఆంగ్లోపాధ్యాయుడు సాదుల వెంకటేశ్వర్లుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.