సీఎం ఇంటి ముందు వృద్ధుడి ఆత్మహత్యాయత్నం.
– నారావారిపల్లెలో ఉద్రిక్తత.
– తిరుపతి ఆసుపత్రికి తరలింపు.
– పరిస్థితి విషమం.
జనం వాయిస్, నారావారిపల్లె:
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట బుధవారం ఉదయం ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి (65) తమ సమస్యలను వినిపించుకునేందుకు ఉదయమే సీఎం ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు.

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోవిందరెడ్డితో పాటు వచ్చిన గ్రామస్తుడు రెడ్డప్ప మాట్లాడుతూ, సీఎం ఇంటి ముందు పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. ఆత్మహత్యాయత్నం చేసిన గోవిందరెడ్డిని స్థానికులు వెంటనే నారావారిపల్లె ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. సీఎం నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
