janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 10:34 am Digital Edition : GATTU MAHESH

కివీస్‌తో తొలి వన్డే..గంభీర్ కన్నింగ్ ప్లాన్‌..

కివీస్‌తో తొలి వన్డే.. గంభీర్ కన్నింగ్ ప్లాన్‌..
– ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆ ముగ్గురు కన్ఫర్మ్‌.

జనం వాయిస్, ముంబై:

కొత్త సంవత్సరం ఆరంభంలో టీమిండియా మరో కీలక వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే పోరుకు భారత జట్టు రంగం సిద్ధం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే రేపు వడోదర క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇప్పటికే స్పష్టత వచ్చింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖరారైంది. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మతో పాటు శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వన్‌డౌన్ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చిన అయ్యర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు.
వికెట్ కీపర్ బాధ్యతలను కేఎల్ రాహుల్ నిర్వహించనున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్న రాహుల్ కారణంగా రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానానికి వాషింగ్టన్ సుందర్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో చోటు ఖాయం అయినట్లు తెలుస్తోంది.
బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వేగ బౌలింగ్ బాధ్యతలు చేపడతారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించనున్నారు. గంభీర్ రూపొందించిన ఈ ప్లాన్‌తో తొలి వన్డేలో కివీస్‌పై పైచేయి సాధించాలని టీమిండియా భావిస్తోంది.