హాస్టల్ ఫుడ్పాయిజన్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్.
జనం వాయిస్,జోగులాంబ గద్వాల్,నవంబర్ 1:
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ధర్మవరం బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్పాయిజన్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది.ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన కమిషన్, హాస్టల్లో 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్లో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం రాత్రి భోజనం అనంతరం 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 55 మందికి అస్వస్థత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ బి.ఎం.సంతోష్ చర్యలు తీసుకున్నారు.హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాములును విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఘటనపై సమగ్ర విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.సస్పెన్షన్ కాలంలో జయరాములు జోగులాంబ గద్వాల్లోనే ఉండాలని, ముందస్తు లిఖిత అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహానికి ఆలంపూర్ ఆఫీసర్ డి.శేఖర్ను తాత్కాలిక ఇన్చార్జిగా నియమించినట్లు అధికారులు వెల్లడించారు.