రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం.
– గిరిజన ప్రాంత ప్రజలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు.
– అల్లుూరి సీతారామ రాజు జిల్లాలో వైద్య సేవలు.
– పలు ప్రత్యేక విభాగాల్లో ఉచిత పరీక్షలు
– గిరిజన, దూర ప్రాంత ప్రజలకు లబ్ధి.
జనం వాయిస్,రంపచోడవరం:
అల్లుూరి సీతారామ రాజు జిల్లాలోని రంపచోడవరం పట్టణంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు విస్తృతంగా లబ్ధి పొందారు.
ఈ వైద్య శిబిరంలో జీఎస్ఎల్ హాస్పిటల్, జీఎస్ఆర్ హాస్పిటల్కు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ విభాగాల్లో సంపూర్ణ వైద్య పరీక్షలు, సలహాలు ఇచ్చారు.

శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. దీర్ఘకాలంగా చికిత్సకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంత ప్రజలకు ఒకే వేదికపై నిపుణ వైద్యుల సేవలు అందడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సలపై మార్గదర్శకత్వం కూడా అందించారు.
దూర, గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, ప్రజల ఆరోగ్యానికి మరింత చేరువ కావాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.