మానవత్వం చాటుకున్న గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి.
రోడ్డు ప్రమాదం బాధితులను ఆదుకున్న పోలీసులు.
జనం వాయిస్, గోదావరిఖని, జూలై 22:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీకి టైరు పంక్చర్ కావడంతో దానిని రోడ్డుపై నిలిపి ఉంచారు.అదే సమయంలో ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం వ్యాన్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్లో ఉన్న వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసి, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రజా భద్రత,నేరాల నియంత్రణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు కూడా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించిన పోలీసు అధికారుల సేవలను స్థానిక ప్రజలు అభినందించారు.