బైక్ అడ్డంగా ఉంది తీయమని అడిగినందుకే..
-వ్యక్తిపై యువకుల దాడి.
-గోదావరిఖని లో ఘటన.
జనం వాయిస్, గోదావరిఖని:
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తూ ఒకరిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై పోలీసులకు రామగిరి క్రాంతి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళ్తే… ఇంటి వద్ద చుట్టాలు వచ్చిన సందర్భంలో మద్యం కోసం క్రాంతి సమీపంలోని ఓ మద్యం షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా, రోడ్డులో ఒక బైక్ అడ్డంగా పెట్టి ఉండటంతో “బైక్ పక్కకు పెట్టండి” అని కోరాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదే అక్కసుతో ఇద్దరు వ్యక్తులు పండు,రవి మాటల దాడికి దిగారని,అనంతరం పండు తన వద్ద ఉన్న పదునైన మరణాయుధంతో తలపై విచక్షణరహితంగా దాడి చేయడంతో రక్తస్రావం జరిగిందని బాధితుడు తెలిపారు.దాడి అనంతరం ఇద్దరూ మద్యం మత్తులో “ఎవరూ ఏం చేయలేరు” అంటూ హంగామా చేస్తూ అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ప్రాణహాని భయంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు.ఇద్దరు వ్యక్తులు తనపై కావాలనే దాడి చేశారని, తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని క్రాంతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.