janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:52 am Digital Edition : JANAM VOICE

అవ్వ – తాతలకు గుడ్‌న్యూస్.

  • అవ్వ – తాతలకు గుడ్‌న్యూస్.
  • కొత్త పింఛన్లు ఇస్తారట.
  • జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.
  • రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా “చేయూత” పథకానికి భారీ ఊతం.
  • రెండు లక్షల కొత్త పింఛన్లకు బడ్జెట్‌లో ఆమోదం.
  • మూడు సంవత్సరాల తర్వాత కొత్త లబ్ధిదారులకు అవకాశం.
  • జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 21:

తెలంగాణలో అవ్వ – తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. “చేయూత” పథకానికి మరింత బలం చేకూర్చేలా ఈసారి బడ్జెట్‌లో రెండు లక్షల కొత్త పింఛన్లకు ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. అయితే గత మూడు సంవత్సరాలుగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో అనేక మంది అర్హులు నిరాశలో ఉన్నారు. ఇప్పటివరకు చనిపోయిన పింఛనుదారుల స్థానంలో వారి భార్యలకు మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పింఛన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అనర్హులను గుర్తించి తొలగించనున్నారు. లైవ్‌నెస్ అథెంటికేషన్ ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి అర్హులకే పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త దరఖాస్తుదారులకు ఈసారి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.