పశుపోషకులకు ఊరటగా ప్రభుత్వం చర్యలు.
– తోటపల్లిలో గొర్రెలు–మేకలకు ఉచిత నట్టల నివారణ ప్రారంభం.
– పాఠశాల భవనం నూతనంగా నిర్మిస్తామని హామీ.
– వివో భవనం మంజూరుకు ప్రకటన.
– మంత్రి పొన్నం ప్రభాకర్.
జనం వాయిస్, హుస్నాబాద్, డిసెంబర్ 24:
హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పశుపోషక రైతులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితేనే రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.అనంతరం తోటపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మంత్రి, విద్యార్థులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పాత పాఠశాల భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతులు మెరుగుపరుస్తామని తెలిపారు.గ్రామాభివృద్ధిలో భాగంగా తోటపల్లిలో వివో భవనాన్ని మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామస్థాయి కార్యకలాపాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ, వెటర్నరీ డాక్టర్లు రమేష్, వెంకట్ రెడ్డి, సుకన్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.