హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.
కమిషనర్ మార్పునకు ఆదేశాలు.
ఐజీ స్థాయి అధికారిని నియమించాలి.
కోర్టు ధిక్కరణలపై తీవ్ర వ్యాఖ్యలు.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 27:
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం విచారణ సందర్భంగా ఏవీ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సంబంధిత భూమిలో హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు. పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంటూ జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణలు కోరారు.
అయితే కమిషనర్ సమర్పించిన వివరణతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇప్పటికే ఆయనపై సుమారు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఒకే అధికారిపై ఇంత పెద్ద సంఖ్యలో ధిక్కరణ కేసులు ఎందుకు నమోదవుతున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించడంలో విఫలమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నిలదీసింది. న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారికి తప్పనిసరి బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రజల హక్కులు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని పరిరక్షించే విషయంలో రాజీ పడబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైడ్రా కమిషనర్ మార్పుతో పాటు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా మారాయి. ఈ ఆదేశాల అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కోర్టు సూచనల మేరకు పరిపాలనా మార్పులు చేపడుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టమైన సందేశంగా భావిస్తున్నారు. న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం లేదా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన విధానాలను అనుసరిస్తూ కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.