మార్వాడీల అక్రమ బీసీ సర్టిఫికెట్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలి.
– బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్.
– లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం.
జనం వాయిస్, చెన్నూరు:
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాజస్థాన్ రాష్ట్రం నుండి వ్యాపార నిమిత్తం వలస వచ్చిన కొందరు మార్వాడీలు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రిజర్వేషన్లు రాష్ట్రాల వారీగా అమలవుతాయి. ఒక రాష్ట్రానికి చెందిన రిజర్వేషన్ హక్కులు మరో రాష్ట్రానికి వర్తించవు. అలాంటప్పుడు రాజస్థాన్ నుండి వలస వచ్చిన మార్వాడీలకు చెన్నూరులో రెవెన్యూ అధికారులు బీసీ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది తెలంగాణ బీసీల రాజ్యాంగబద్ధ హక్కులపై జరిగిన తీవ్ర కుట్ర” అని మండిపడ్డారు. మార్వాడీలు స్వచ్ఛందంగా తమ అక్రమ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేసుకోవాలని, లేకపోతే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చకినారపు మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, “ప్రాంతీయేతరులైన మార్వాడీలు వ్యాపార నిమిత్తం వచ్చి ఈ ప్రాంతంపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోము. ఇది స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతాం” అని స్పష్టం చేశారు. బీసీ జేఏసీ నాయకులు అక్కల రాజన్న యాదవ్ మాట్లాడుతూ, “రాజస్థాన్ మార్వాడీలు బీసీ సర్టిఫికెట్లు పొందడం అంటే తెలంగాణలో బీసీలకు దక్కాల్సిన హక్కులను హరించినట్లే. తెలంగాణలో కోట్ల రూపాయలు సంపాదించి, మా హక్కులను కాలరాసే కుట్రలు చేయడం సహించబోము. స్వచ్ఛందంగా సర్టిఫికెట్లు రద్దు చేసుకోకపోతే అక్రమ వ్యాపారాలు, పన్ను ఎగవేతలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు అన్నింటినీ ప్రజల ముందు బట్టబయలు చేస్తాం” అని హెచ్చరించారు. ఈ అక్రమ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికార యంత్రాంగం వెంటనే స్పందించి విచారణ చేపట్టి అక్రమంగా పొందిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మాల మహానాడు నాయకుడు నవీన్, జేఏసీ నాయకులు నిట్టూరి సారయ్య, మామిడాల పోచం, అడ్డురి సమ్మయ్య, ఎర్రోళ్ల సంజీవ్, మాదాసు కిష్టయ్య, జీర్ల మధుకర్, అక్కల కిట్టేష్ యాదవ్, నరిగే లింగయ్య, దుర్గయ్య, బాపు, మేకల లింగయ్య, గండ్రకోట రాజన్న, నాగేష్, ఈరబోయిన శ్రీనివాస్, ఏదండ్ల బాలేష్, నరిగె మొండయ్య, గెల్లు కుమార్, అడ్డూరి సమ్మయ్య, భూసరి పవన్ కళ్యాణ్, కొడారి ఐల్లయ్య తదితరులు పాల్గొన్నారు.