janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 6:10 pm Digital Edition : GATTU MAHESH

జాబ్ నోటిఫికేషన్ల కోసం మేడారం జాతరలో నిరుద్యోగుల వినూత్న నిరసన.

జాబ్ నోటిఫికేషన్ల కోసం మేడారం జాతరలో నిరుద్యోగుల వినూత్న నిరసన.

– షాపు ఏర్పాటు చేసి బ్యానర్లతో నిరసన.
– ఉద్యోగాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు.
– సమ్మక్క తల్లిని వేడుకున్న నిరుద్యోగులు.

జనం వాయిస్, మేడారం:

ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ నిరుద్యోగ యువత మేడారం జాతరలో వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోవడంతో ఉపాధి లేక జాతరలో షాపు పెట్టుకున్నామని పేర్కొంటూ, నిరుద్యోగులు బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నిరసన భక్తులు, సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమతో ప్రభుత్వం ఆటలు ఆడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఈ పరిస్థితికి గట్టి సమాధానంగానే మేడారం జాతరలో ఈ నిరసన చేపట్టామని తెలిపారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయంలో అమ్మవార్లను వేడుకున్నారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసేలా దారి చూపాలని, యువతకు న్యాయం చేయాలని సమ్మక్క తల్లికి విజ్ఞప్తి చేశారు. తమ పోరాటానికి దైవిక ఆశీస్సులు కావాలని ప్రార్థించారు.
జాతర వేదికగా నిరుద్యోగుల సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జై సమ్మక్క తల్లి… జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేస్తూ, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిరుద్యోగులు స్పష్టం చేశారు.