janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:45 am Digital Edition : JANAM VOICE

సూర్యకు కెప్టెన్సీ గండం?

సూర్యకు కెప్టెన్సీ గండం?

జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 5:

టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్, జులై నెలల్లో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందే అతడిని టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ తీవ్ర ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఒకప్పుడు ప్రపంచ టీ20 క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్, ప్రస్తుతం పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో కూడా అతడి ప్రదర్శన నిరాశపరిచింది. ముంబై జట్టు తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతడు కేవలం 270 పరుగులు మాత్రమే సాధించాడు. 2017 తర్వాత అతడికి ఇదే అత్యంత పేలవమైన లీగ్ సీజన్‌గా నమోదైంది.
ఈ పరిస్థితుల్లో సూర్యను కేవలం కెప్టెన్సీ నుంచే కాకుండా జట్టు నుంచి కూడా తప్పించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన ఎంపికల కమిటీ అధిపతి అజిత్ అగార్కర్‌లతో భారత క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశమై భవిష్యత్ వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే టీ20 సిరీస్‌ల కోసం కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని సూచించినట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారత జట్టు భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. సూర్య నాయకత్వంలో ప్రపంచకప్ గెలిచినప్పటికీ, అతడి వ్యక్తిగత ప్రదర్శనలో నిలకడ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడికి బోర్డు తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, కొత్త కెప్టెన్ ఎంపికలో పలువురు ఆటగాళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్ తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి టీ20 జట్టు పగ్గాలు అప్పగించే అవకాశముందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.