హైదరాబాద్ లో వానలే వానలు.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 30:
ఉత్తర తెలంగాణ ప్రాంతాలతో పాటు రాజధాని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రహదారులు జలమయమై వరద నీరు పొంగిపొర్లింది. దీంతో పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు మంగళవారం రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ల మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా వెళ్లే అవకాశముంది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ 10 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ హెచ్చరికలు జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇక గురువారం, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో అత్యధికంగా 5.8 సెం.మీ వర్షం కురిసింది. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెం.మీకి పైగా వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెం.మీ వర్షం పడగా… జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచామని, అవసరాన్ని బట్టి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎస్ వెల్లడించారు.
ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం రోజున వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని… ముఖ్యంగా చెట్లు, ప్రకటనల హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బొగత జలపాతం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత 10 గంటలుగా అటవీ ప్రాంతంలో వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరి జలపాతం ఉగ్రరూపం దాల్చింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.వరద ఉద్ధృతికి రాళ్లు జారే ప్రమాదం ఉండటంతో పాటు ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశమున్నందున పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాత పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు తెలిపారు. వరద తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు పోలీసులు, అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు.