జగన్ మీడియాపై కేసు నమోదు
-అసత్య కథనాలు ప్రచారం చేశారన్న ఆరోపణలు
-పొన్నూరు ఆలయ ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదుతో పోలీసుల చర్య
-మందబుద్ధిగా పరువు తీశారంటూ తీవ్ర ఆరోపణలు
జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్:
గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్ మీడియా యాజమాన్యం మరియు పలువురు ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసత్య కథనాలు ప్రచురించి, తన పరువుకు భంగం కలిగించారంటూ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య, జగన్ మీడియా సంస్థలు తనపై దొంగతనం కేసు మోపినట్లు వార్తలు ప్రచారం చేశాయని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో నిందితుడిగా చూపించడం పూర్తిగా కల్పితం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఒంగోలు పోలీసులు తన ఇంటిపై దాడులు చేసి వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా ప్రకటించడం పూర్తిగా అసత్యమని చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తల ద్వారా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై కూడా తప్పుడు, హేయమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడింది. తనను మరియు ఎమ్మెల్యేను ప్రజల దృష్టిలో దిగజార్చే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రచారం జరిపిందని చెన్నయ్య ఆరోపించారు. టీవీ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన కుటుంబం, వ్యక్తిగత జీవితం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని ఆయన పేర్కొన్నారు. చెన్నయ్య ఫిర్యాదు ఆధారంగా జగన్ మీడియా ప్రతినిధులు తలారి సురేంద్రనాథ్, వై. అశోక్వర్థన్ సహా యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పొన్నూరు అర్బన్ సీఐ ఎల్. వీరానాయక్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ కథనాలను పంచిన వారిని కూడా గుర్తించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.