జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం.
– మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరంభం.
– రూ.2 కోట్లు విరాళం ఇచ్చి తొలి సభ్యత్వం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
– “ఉద్యమి”, “సాధక్”, “ప్రదాత” పేర్లతో కొత్త వర్గీకరణ.
జనం వాయిస్, మంగళగిరి, ఫిబ్రవరి 15:
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాల విస్తరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళంగా అందించి, తొలి సభ్యత్వాన్ని స్వయంగా తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారిని “ఉద్యమి”గా పిలుస్తామని ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కొత్త సభ్యులను చేర్చేవారిని “సాధక్”గా పేర్కొంటామని తెలిపారు. జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటాలకు పరోక్షంగా సమయం, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందించే వారిని “ప్రదాత”గా ఇకపై సంబోధిస్తామని తెలిపారు. ఈ వర్గీకరణ ద్వారా పార్టీకి బలమైన నిర్మాణాత్మక శక్తి అందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, యువతను, వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.