janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 2:11 pm Digital Edition : JANAM VOICE

అమ్ముడుపోతున్న జర్నలిజం!

అమ్ముడుపోతున్న జర్నలిజం!

రాజకీయ పార్టీలకు తలోగ్గుతున్న కొందరి కలాలు.

అర్హతలు, అనుభవం లేకున్నా ‘ప్రెస్’ ముసుగులో హల్‌చల్.

నిజమైన జర్నలిస్ట్ లకు తప్పని తిప్పలు.

జనం వాయిస్, ప్రత్యేక కథనం:

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన జర్నలిజం నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజల సమస్యలను ప్రశ్నించాల్సిన కలం కొందరి విషయంలో రాజకీయ అనుబంధాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు వేదికగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్న పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వార్తా? రాజకీయ ప్రచారమా?

రాజకీయ కార్యక్రమాలను వార్తలుగా ప్రచురించడం మీడియా బాధ్యతలో భాగమే. కానీ వార్తకు, ప్రచారానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోతే జర్నలిజం విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా ప్రశ్నించాల్సిన కలం ఒకవైపు మాత్రమే నిలిస్తే ప్రజల్లో మీడియాపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది.

పాత్రికేయుడి విధేయత ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ కాకుండా నిజానికి, ప్రజలకు ఉండాలి. ఇదే జర్నలిజం ప్రాథమిక సూత్రం.

అర్హత లేకున్నా ‘ప్రెస్’ ముసుగు!

పాత్రికేయ వృత్తికి అవసరమైన అర్హతలు, అనుభవం, వృత్తి నైతికతను పక్కనపెట్టి కొందరు ‘ప్రెస్’ పేరుతో తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీడియా గుర్తింపు అనేది హోదా కోసం కాదు.. ప్రజల తరఫున బాధ్యతగా పనిచేయడానికి.

కొంతమంది వ్యక్తుల చర్యల వల్ల మొత్తం జర్నలిస్టు సమాజానికే చెడ్డపేరు రావడం ఆందోళన కలిగించే అంశం. నిజాయితీగా పనిచేస్తున్న పాత్రికేయులు మాత్రం ప్రతి అడుగులో తమ వృత్తి విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నిజమైన జర్నలిస్టుకు ఎందుకీ తిప్పలు?

ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా సమస్యలపై వార్తలు రాసే పాత్రికేయులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నిస్తే ఒక వర్గానికి చెందినవారిగా ముద్ర.. వాస్తవాలు రాస్తే మరో వర్గానికి వ్యతిరేకులుగా ప్రచారం.. ఇదేనా జర్నలిజం?

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారులను ప్రశ్నించడం, వాస్తవాలను నిర్ధారించడం, తప్పును తప్పుగా చెప్పడం—ఇవే పాత్రికేయుడి అసలు బాధ్యతలు.

కలానికి ధర కట్టొద్దు..

జర్నలిజం ఒక వ్యాపారం కాదు. ప్రజల నమ్మకంతో నడిచే బాధ్యతాయుతమైన వృత్తి. మీడియా సంస్థలు కూడా ప్రతినిధుల ఎంపికలో అర్హతలు, అనుభవం, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కలం ఎవరి కాళ్ల దగ్గరా వంగకూడదు..
నిజం ఎవరి ఒత్తిడికీ భయపడకూడదు..
ప్రజల కోసం పనిచేసే కలమే నిజమైన జర్నలిజం!

  • గట్టు మహేష్ గౌడ్
  • ఎడిటర్ జనం వాయిస్ తెలుగు దినపత్రిక ✍️✍️.