జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం.
-నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ.
-సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులపై ఆవేదన.
-మాగంటి గోపీనాథ్పై కేసు వెనక్కి తీసుకున్నట్టు వెల్లడి.
జనం వాయిస్,హైదరాబాద్ :
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈరోజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ చేత ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ రాజ్యాంగ దినోత్సవం రోజున ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించడం తనకు ప్రత్యేక గౌరవమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రాధాన్యత అని, ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా పనిచేయడం లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తనతో పాటు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దాడులు జరుగడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై తాను వేసుకున్న కేసును వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు. ఆ కేసు విచారణ దశలో ఉండగానే గోపీనాథ్ మరణించారని, ఆయన ఉన్నా లేకపోయినా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక తప్పదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో మద్దతు అందించిన ఎంఐఎం పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్పై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టడం తన బాధ్యత అని నవీన్ యాదవ్ అన్నారు.