భూదందాలపై కవిత సంచలన ఆరోపణలు.
– కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు.
– భూముల రక్షణకు పోరాటం.
– ఆధారాలతో బహిర్గతం చేస్తామన్న కవిత.
జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 7:
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని భూదందాలు, ఆక్రమణల వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆమె ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదలపై చర్యలు తీసుకుంటూ, పెద్ద స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చెరువులు, ప్రభుత్వ భూములు, జలవనరులకు సంబంధించిన అనేక అంశాలను త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు.
తెలంగాణ వనరులు, భూములు, సంస్కృతిని రక్షించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర భూములను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని, సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం తెలంగాణ సంపదను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు, భూవ్యవహారాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని ప్రాజెక్టులపై ప్రశ్నలు లేవనెత్తారు. చెరువులు, శిఖం భూములు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వివాదాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భూసంపద విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
రాష్ట్ర జలవనరుల అంశంపైనా కవిత స్పందించారు. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు ప్రాంతానికి సంబంధించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, వారికి భూముల కేటాయింపు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. ఉద్యమకారుల హక్కుల కోసం భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.