ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.
– నందినగర్ నివాసంలో 4 గంటల 45 నిమిషాల విచారణ.
– ఆడియో–వీడియో రికార్డింగ్తో ప్రశ్నలు.
– విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావుతో చర్చ.
– నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతల నిరసన.
జనం వాయిస్, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలపాటు విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో విచారించిన వ్యక్తులు వెల్లడించిన అంశాల ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోని రెండో అంతస్తు గదిలో విచారణ ప్రారంభించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసీఆర్ తన కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మచ్చలేని నేతను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో వారు తెలంగాణ భవన్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ ఊపందుకుంది.