ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.
– తల్లిదండ్రులకు వాట్సాప్లో హాల్టికెట్లు…
జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 02:
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్కు పంపించాలని బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, పరీక్షలకు దాదాపు రెండు నెలల ముందే ఈ హాల్టికెట్లు పంపించనున్నారు. హాల్టికెట్లు ముందుగానే తల్లిదండ్రులకు అందితే, వాటిలో ఉన్న పేరు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, పరీక్షల తేదీలు వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ముందే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండటంతో ఈ విధానం మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల హాల్టికెట్ను క్షుణ్ణంగా పరిశీలించి, ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కు తెలియజేయాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్టికెట్ నంబర్, పరీక్ష కేంద్రం చిరునామా, ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో వంటి సమాచారం తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పరీక్షల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థంగా సాగుతుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.