ఖైరతాబాద్ వినాయకుడు.. నేటి నుంచి 24వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
భక్తుల దర్శనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ వినాయకుడు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు.
ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు భక్తులు సహకరించాలని కోరిన పోలీసులు.
జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12:
హైదరాబాద్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ ప్రతిష్టాపన, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ కీలక ఆంక్షలు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:
రాజీవ్గాంధీ విగ్రహం జంక్షన్: పీవీ విగ్రహం వైపు నుంచి రాజీవ్గాంధీ విగ్రహం మీదుగా మింట్కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
రాజ్దూత్ లేన్: రాజ్దూత్ లేన్ మీదుగా బడా గణేశ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఇక్బాల్ మినార్ వైపు పంపిస్తారు.
మింట్ కాంపౌండ్: మింట్ కాంపౌండ్ మీదుగా ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు, మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్ దారి: ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్ లేన్ మీదుగా రైల్వేగేటు వైపు వెళ్లే వాహనాలను పోస్ట్ఆఫీసు జంక్షన్ వద్ద పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు పంపిస్తారు.
భక్తుల వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలు:
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలను రేస్ కోర్సు రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంతో పాటు ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యే వరకు వాహనదారులు, భక్తులు ఈ ఆంక్షలకు సహకరించాలని కోరారు.