మందమర్రిలో వ్యక్తి దారుణ హత్య.. కుటుంబ కలహాలే కారణమా?.
జనం వాయిస్ | మందమర్రి | జూన్ 29:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బొక్కలగుట్ట ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, గజ్జి వెంకటేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఒడ్డేపల్లి రాజ్కుమార్ గడ్డకట్టిన సిమెంట్ బస్తాను విసరడంతో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు వెంకటేష్కు, నిందితుడు రాజ్కుమార్కు మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.