janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:51 pm Digital Edition : JANAM VOICE

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.

ఇరవై ఒక్క మంది మృతి.
మంటల్లో చిక్కుకున్న విదేశీయులు.
సహాయక చర్యలు కొనసాగింపు.

జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 3:

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో చెలరేగిన మంటల కారణంగా కనీసం ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో విదేశీ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాలవీయ నగర్ ప్రాంతంలోని భవనం దిగువ అంతస్తులో ఉన్న భోజనశాలలో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ ప్రారంభమైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో బస చేస్తున్న వారు ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో చిక్కుకుపోయారు. ప్రమాదం సంభవించిన సమయంలో పలువురు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. మంటల తీవ్రత పెరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు పై అంతస్తుల నుంచి కిందకు దూకారు. స్థానికులు వెంటనే స్పందించి రహదారిపై పరుపులు ఏర్పాటు చేసి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర బృందాలు కలిసి నలభై మందికి పైగా బాధితులను రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ భవనం విదేశాల నుంచి వైద్య చికిత్సల కోసం వచ్చిన వారు ఎక్కువగా బస చేసే కేంద్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు చెందిన పలువురు అక్కడ నివసిస్తున్నట్లు వెల్లడైంది. మృతుల్లో కూడా విదేశీయులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. భోజనశాలలోనే మంటలు ప్రారంభమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.