janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 1:11 pm Digital Edition : GATTU MAHESH

మేడిగడ్డ డేంజర్ – కేంద్రం రెడ్ అలర్ట్

మేడిగడ్డ డేంజర్ – కేంద్రం రెడ్ అలర్ట్

జనం వాయిస్, మేడిగడ్డ:

మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ల భద్రతపై నిర్వహించిన తాజా సమీక్షలో భాగంగా మేడిగడ్డను అత్యంత ప్రమాదకర జాబితా అయిన కేటగిరీ-1 ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. 2025 వర్షాకాలం తర్వాత నిర్వహించిన క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు కేంద్ర బృందం స్పష్టం చేసింది. బ్యారేజీ భద్రత విషయంలో కేంద్రం జారీ చేసిన ఈ రెడ్ అలర్ట్ మరోసారి రాజకీయ అంశం కానుంది.

ఎన్డీఎస్‌ఏ రిపోర్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో, ప్రస్తుత స్థితిలో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కేటగిరీ-1 కింద వర్గీకరించిన ప్రాజెక్టులు అంటే.. వాటిలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దకపోతే అవి ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అర్థం. ఈ ప్రాజెక్టు పునాదులు కుంగిపోవడం, భారీ పగుళ్లు వంటి సమస్యల కారణంగా దీని భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.

దేశంలోని డ్యామ్‌ల స్థితిగతులను కేంద్రం మొత్తం మూడు కేటగిరీలుగా విభజించింది. అందులో మొదటి కేటగిరీలో ఉన్న ప్రాజెక్టులకు తక్షణ అత్యవసర మరమ్మతులు అవసరమని తెలిపింది. మేడిగడ్డతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నందున కేంద్రం ఇచ్చిన ఈ నివేదిక బ్యారేజీ భవిష్యత్తుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈ బ్యారేజీకి సంబంధించి కేంద్రం చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కూడా వేడిని పెంచింది. ప్రాజెక్టు డిజైన్ , నిర్మాణ నాణ్యతపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోతే, ఈ భారీ నిర్మాణం పూర్తిగా నిరుపయోగంగా మారే ముప్పు పొంచి ఉందని నివేదిక సారాంశం చెబుతోంది.