janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 5:43 pm Digital Edition : GATTU MAHESH

జీహెచ్‌ఎంసీ పరిధిలో మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్.

– నగరవ్యాప్తంగా ప్రత్యేక వాహనాలు, సేకరణ కౌంటర్లు ఏర్పాటు.
– మొదటి రోజే 47 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాల సేకరణ.
– శుభ్రమైన, పచ్చని హైదరాబాద్‌కు పౌరుల భాగస్వామ్యం అవసరం.

జనం వాయిస్, హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్ రెండో రోజుకూడా విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలు, ఈ–వ్యర్థాల సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, వినియోగానికి పనికిరాని పరికరాలను సేకరిస్తున్నారు.
డ్రైవ్ తొలి రోజే ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు తెలిపారు. ఒక్క రోజులోనే 47 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలను సేకరించడం ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఎంత బలంగా ఉందో సూచిస్తోందన్నారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు వంటి ఈ–వ్యర్థాలను సురక్షితంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ–వ్యర్థాలను ఇళ్లలో, వీధుల్లో పడేయకుండా అధికారికంగా సేకరణకు అందించాలని జీహెచ్‌ఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. శుభ్రమైన, పచ్చని హైదరాబాద్ లక్ష్యంగా ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలని, ఈ డ్రైవ్‌కు సహకరించాలని అధికారులు కోరారు.