గ్లోబల్ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి.
-“సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం”.
జనం వాయిస్,హైదరాబాద్, డిసెంబర్ 09:
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో సినీ రంగం పాల్గొనడంతో కార్యక్రమం మరింత రంజుగా మారింది. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్తో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నటీమణులు జెనీలియా, అక్కినేని అమలతో సహా టాలీవుడ్–బాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సభలో మాట్లాడుతూ.. “ఇంత గొప్ప వేదికలో పాల్గొనే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది చిరంజీవికి వచ్చిన ఆహ్వానం కాదు… మొత్తం సినీ ఇండస్ట్రీ తరఫున వచ్చిన గౌరవం. హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న దిశ ప్రశంసనీయం” అన్నారు. ఇతర భాషల నుండి కూడా భారీ స్థాయిలో సినిమాలు హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి వచ్చే విధంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధి దేశ జీడీపీకే మేలు చేస్తుందని, ఈ లక్ష్యంతో త్వరలోనే మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
⦁ కొరియా ఉదాహరణను ప్రస్తావించిన చిరంజీవి.
“అక్కడ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్తో చిత్ర పరిశ్రమను ఎదిగేలా చేసింది. అదే విధంగా మనం కూడా యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచే విధంగా, సినిమా రంగం ద్వారా సృజనాత్మక దారుల్లో నడిపించవచ్చు” అన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి సినీ హబ్గా ఎదగడంలో ప్రభుత్వం–పరిశ్రమల సమగ్రమైన సహకారం కీలకమని ఈ సమావేశంతో మరోసారి స్పష్టమైంది.