janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 5:26 pm Digital Edition : GATTU MAHESH

మేడారం లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలు ధ్వసం.

మేడారం లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలు ధ్వసం.

– భద్రత, ఏర్పాట్లపై విమర్శలు.

– మేడారం మహాజాతరలో కీలక ఘట్టం.

– గద్దెలపై కొలువుదీరిన వన దేవతలు.

– జనసంద్రంగా మారిన మేడారం పరిసరాలు.

జనం వాయిస్, మేడారం:

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారి, అడుగడుగునా భక్తుల రద్దీ కనిపించింది. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరడంతో గురువారం అర్ధరాత్రి నుంచే జాతర ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. అయితే గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన కొందరు భక్తులు అక్కడే ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని దుకాణాలకు నష్టం కలిగించారు. ఈ ఘటన జాతర ఏర్పాట్లపై విమర్శలకు దారి తీసింది. ఇదిలా ఉండగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం జాతరకు హాజరై వన దేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ వన దేవతలను దర్శించుకున్నారు.
ఈ నెల 28న ప్రారంభమైన మేడారం మహాజాతర ఈ నెల 31న ముగియనుంది. వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఇరవై ఐదు మంది ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే పోలీసులు వీవీఐపీలు, వారి కుటుంబాల సేవకే పరిమితమై సామాన్య భక్తుల రద్దీ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు భక్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. జాతర చివరి రోజుల్లో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.