మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం.
-రాష్ట్ర ఐటి,పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
-మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
జనం వాయిస్,మంథని, నవంబర్-24:
మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ VIATRIS సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో మంథని ప్రాంతంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 21 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలి, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, ఆర్టిసి అద్దె బస్సుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు.కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలకు ఉపాధి లభిస్తుందని,ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు.మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నంతో మంథని లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.మహిళ సోదరీమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని,ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాలలో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 12 లక్షలతో స్కానింగ్ మిషన్, ఒక లక్షల 80 వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఆర్.ఓ వాటర్ ప్లాంట్, లక్ష రూపాయలతో ఏర్పాటుచేసిన ఔట్ పేషెంట్ రూమ్,5 లక్షల రూపాయలతో నిర్మించిన పేషెంట్ వెయిటింగ్ హాల్, లక్ష రూపాయలతో కొనుగోలు చేసిన పిల్లల వార్మర్స్, 12 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, సీసీ కెమెరాలు పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.