janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 6:07 pm Digital Edition : JANAM VOICE

చెట్టు తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు.

చెట్టు తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు.

• ఎస్సై పరమేష్ చొరవతో రోడ్డుకు అడ్డంకి తొలగింపు.

జనం వాయిస్, శాయంపేట, సెప్టెంబరు 14:

మాందారిపేట నుంచి శాయంపేటకు వెళ్లే మార్గంలో రంగయ్యకుంట సమీపంలో ఆదివారం విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం రాత్రివేళ తొలగించింది. ట్రాక్టర్‌ డోజర్‌, కట్టర్‌ సహాయంతో చెట్టును ముక్కలుగా కట్‌ చేసి, డోజర్‌తో రహదారి పక్కకు తరలించారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పరమేష్ వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో కలిసి రాత్రి సమయంలో చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. చెట్టును తొలగించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

గుంతల రహదారిపై మాత్రం కొనసాగుతున్న ఇబ్బందులు..

చెట్టు తొలగిపోయినా రంగయ్యకుంట సమీపంలోని రహదారి గుంతలమయంగా ఉండటంతో వాహనదారుల ఇబ్బందులు మాత్రం కొనసాగుతున్నాయి. వర్షపు నీరు గుంతల్లో చేరడంతో అవి కనిపించక ప్రమాదాలకు దారితీసే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.