నాది-రేవంత్ రెడ్డిది లక్కీ జోడి: మహేష్ కుమార్ గౌడ్.
సమన్వయంతో పార్టీ ముందుకు.
ప్రజల ఆకాంక్షలే లక్ష్యం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుపు ధీమా.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 13:
నాది, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిది లక్కీ జోడి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో డి. శ్రీనివాస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి పార్టీని ఎలా నడిపారో అదే విధంగా తాము సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం, తాను కలిసి పనిచేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేస్తున్నామని, అందుకే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని, ప్రజలు ప్రభుత్వ పనితీరుకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమన్వయంతో ముందుకు సాగుతున్న పార్టీకి ప్రజల ఆశీర్వాదం కొనసాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.