నానమ్మను చూసేందుకు వచ్చి అనంత లోకాలకు..
-నాగర్కర్నూలు జిల్లాలో విషాదం
-నీటి గుంటలో పడి ముగ్గురు బాలికలు మృతి.
-ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లి శివారులో ఘటన.
-నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన చిన్నారులు.
-ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం.
జనం వాయిస్, నాగర్కర్నూలు:
నాగర్కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉర్కొండ మండలం పరిధిలోని ముచ్చర్లపల్లి శివారులో ఉన్న పొలంలోని నీటి గుంటలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు (11)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, ఈ చిన్నారులు ముచ్చర్లపల్లిలో నివసించే నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆటపాటల మధ్య పొలంలోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటి గుంట నుంచి బాలికల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పొలాల్లో ఉన్న ప్రమాదకర నీటి గుంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.