ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ఎకానమీకి గ్లోబల్ అవకాశాలు.
– ‘క్రియేటర్ ల్యాండ్’ ప్రాజెక్ట్కు కాన్వా భాగస్వామ్యాన్ని ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.
– సాన్ఫ్రాన్సిస్కోలో కాన్వా ప్రముఖులతో భేటీ.
– అమరావతిని ప్రపంచస్థాయి ఎంటర్టైన్మెంట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు.
– యువతకు సృజనాత్మక నైపుణ్యాలు, డిజిటల్ ఉద్యోగాల్లో విస్తృత అవకాశాలు.
జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09:
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా సాన్ఫ్రాన్సిస్కోలో డిజిటల్ డిజైన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థైన కాన్వా ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ అధికారి రాబ్ గిగ్లియోతో ఆయన విస్తృత చర్చలు నిర్వహించారు. రాష్ట్ర యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా ఈ సమావేశం ముఖ్య అడుగుగా నిలిచింది.మంత్రి లోకేష్ మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, ప్రపంచస్థాయి వినోద–సృష్టి నగరంగా (ఎంటర్టైన్మెంట్ సిటీ) తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ను క్రియేటివ్ ఎకానమీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘క్రియేటర్ ల్యాండ్’ ప్రాజెక్ట్కు కాన్వా భాగస్వామ్యం అందించాలన్న ఆహ్వానాన్ని ఆయన అందించారు.డిజిటల్ డిజైన్, క్రియేటివ్ నైపుణ్యాలు, కంటెంట్ నిర్మాణం—ఇవి భవిష్యత్ ఉద్యోగాల్లో కీలకమైన నైపుణ్యాలుగా మారుతున్నాయని, ఈ రంగాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ, అవకాశాలు అందించాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. “క్రియేటివ్ రంగం అనేది ఆర్థికాభివృద్ధికి కొత్త ఇంధనం. కాన్వా వంటి ప్రపంచ స్థాయి వేదికలు యువతకు నైపుణ్యాలు నేర్పడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని ఆయన అన్నారు.అమరావతి గ్లోబల్ స్థాయి నవీన కేంద్రంగా ఎదుగుతోందని, ప్రభుత్వం సృజనాత్మక పరిశ్రమలకు మౌలిక వసతులు, పెట్టుబడులు, శిక్షణ కేంద్రాలు అందించేందుకు సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో క్రియేటివ్ రంగం వాటా భారీగా పెరగబోతుందనే నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.