janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 9:56 am Digital Edition : GATTU MAHESH

పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లపై బలవంతం వద్దు: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లపై బలవంతం వద్దు: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.

– వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులకు సూచన.
– చలాన్ వసూలు పేరుతో తాళాలు లాక్కోవడం, వాహనం ఆపడం నిషేధం.
– చట్ట ప్రకారం నోటీసుల జారీకి ఆదేశం.

జనం వాయిస్, హైదరాబాద్:

వాహనాల పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌ల అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్‌ల పేరుతో వాహనదారులను బలవంతంగా ఇబ్బంది పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. చలాన్‌లు వసూలు చేసే క్రమంలో బలవంతపు చర్యలు చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్‌ల వసూలు కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. వాహనాలను ఆపి, తాళాలు లాక్కోవడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాహనాలను ఆపిన సమయంలో చలాన్‌లు చెల్లించాలని బలవంతం చేయకూడదని, వాహన తాళాలు తీసుకోవడం, వాహనాన్ని నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడరాదని పేర్కొంది. వాహనదారు స్వచ్ఛందంగా చలాన్ చెల్లించేందుకు ముందుకు వస్తే మాత్రమే పోలీసులు వసూలు చేయవచ్చని తెలిపింది.
వాహనదారులు చలాన్‌లు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో, చట్ట ప్రకారం వారికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని కోర్టు స్పష్టం చేసింది.