janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 10:00 pm Digital Edition : GATTU MAHESH

తిరుమల పరకామణి కేసులో కీలక మలుపు.

తిరుమల పరకామణి కేసులో కీలక మలుపు.

-హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక సమర్పణ.

జనం వాయిస్,అమరావతి,డిసెంబర్09:

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ వ్యవహారంపై సీఐడీ తయారు చేసిన అదనపు నివేదికను మంగళవారం హైకోర్టులో సమర్పించింది. ఈ నివేదికను రెండు సెట్లుగా సీల్డ్ కవర్లలో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతపై పరిశీలన జరుపుతోంది. దీనిలో భాగంగా సీఐడీ సమర్పించిన అన్ని నివేదికలను రిజిస్ట్రీ ధర్మాసనం ముందు ఉంచాలని హైకోర్టు సూచించింది. నివేదికలను పరిశీలించిన తరువాత తగిన ఉత్తర్వులు ఇవ్వడానికై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే పరకామణి చోరీ రాజీ వ్యవహారం, నిందితుడు రవికుమార్ ఆస్తులకు సంబంధించిన కీలక వివరాలను సీఐడీ సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందించింది. రవికుమార్ తరఫు న్యాయవాది ‘సీఐడీ నివేదికను తమకు ఇవ్వాలని’ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు నేపథ్యం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ పట్టుబడ్డాడు. ఇది మొదటిసారే తప్పు చేశానంటూ క్షమాపణ చెప్పించుకొని, అతడు కలిగి ఉన్న సుమారు రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేయించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2023 జూన్ 19న ఆ తీర్మానం ఆమోదం పొందింది. ఆ తరువాత మూడు నెలల్లో కేసును రాజీ కుదర్చడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతుండటంతో సీఐడీ పూర్తి స్థాయి విచారణ చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించింది. రేపటి విచారణలో ఈ నివేదిక కేసు భవిష్యత్తును ఏ దిశకు నడిపిస్తుంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది.