నామినేటెడ్ పదవులపై జనసేన నేతలకు పవన్ గట్టి హెచ్చరిక.
-అధికార దుర్వినియోగం చేస్తే సహించను
ఉప ముఖ్యమంత్రి స్పష్టం.
జనం వాయిస్, మంగళగిరి, డిసెంబర్ 22:
నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టంగా తేల్చిచెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జనసేన నిర్వహించిన ‘పదవి–బాధ్యత’ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు వచ్చిన పదవులను బాధ్యతతో నిర్వర్తించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని రెండు చేతులు జోడించి కోరుతున్నానని పవన్ అన్నారు. మీరు తప్పు చేసినట్టు తనకు తెలిసితే ఎలాంటి సంశయమూ లేకుండా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఓటమి సమయంలో కూడా పార్టీ కోసం బలంగా నిలబడినందువల్లే నేడు నాయకులకు పదవులు దక్కాయని ఆయన గుర్తు చేశారు. యువతకు సరైన వేదిక అందించాలనే లక్ష్యంతోనే **జనసేన పార్టీ**ని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు. సరైన సిద్ధాంతం లేకపోతే యువత దారి తప్పే ప్రమాదం ఉందని, అందుకే సలసల మరిగే యువతకు జనసేన ఒక దారి చూపే వేదిక కావాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఇతర పార్టీలకు సిద్ధంగా ఉన్న కేడర్ లభించిందని, కానీ జనసేన మాత్రం ప్రతిదీ సొంతంగా నిర్మించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
జనసేన సిద్ధాంతం విడదీయడానికేగాక అందరినీ కలుపుకుపోయేదని పవన్ స్పష్టం చేశారు. జాతీయ దృక్పథంతోనే తాను ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి జరగాలని, పార్టీ శ్రేణులు చేసే ప్రతి పని రాజ్యాంగానికి లోబడే ఉండాలని ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.