అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయండి..
-కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు.
-పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
జనం వాయిస్,పెద్దపల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం రోజున జూలపల్లి మండలం పెద్దాపూర్, సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, భూపతిపూర్, నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి, కందునూరుపల్లి, నారాయణపూర్ మరియు చిన్న బొంకూర్, మద్దికుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ నమూనాలతో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ఓటర్లను అభ్యర్థించారు.ముందుగా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలోని రామాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాదిరిగా అనేక హామీలను నెరవేర్చుతూ ప్రజల ముంగిటకు తీసుకురావడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక విధాలుగా దోపిడీకి గురయ్యారని చెప్పారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వడ్ల కోత పేరిట అందినంత దోచుకున్నారని చెప్పారు. తాను ఎలాంటి కోతలు లేకుండా సెంటర్లలో వడ్ల కొనుగోల్లను చేపట్టి రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటున్నామని చెప్పారు. త్వరలోనే రైతులకు సన్న వడ్లకు సంబంధించిన బోనస్ డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గ్రామాలలో పక్కా ప్రణాళిక కార్యాచరణతో ప్రజలు కోరిన పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. మాట తప్పే ప్రసక్తి లేదని అన్నారు. అలాగే నిరంతరం ప్రజల కోసం శ్రమించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలతో పాటు సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణానికి నిధులు అందిస్తూ గ్రామాలను సస్యశ్యామలం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచి మరింత అభివృద్ధికి దోహదపడతారని తెలిపారు.మరో మూడు సంవత్సరాల కాలం ఉందని అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.