- తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు.
- ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
- మంత్రి పొంగులేటి.
- జనం వాయిస్, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ భుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. మొదటి దశలో భాగంగా ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు సకల వసతులతో శాశ్వత భవనాల నిర్మించాలని, రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాల పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు ఒకే మోడల్లో, ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా డిజైన్ చేయాలని చర్చించామని అన్నారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం, గచ్చిబౌలి, మేడ్చల్, పఠాన్ చెరువులలో ఇప్పటికే అత్యాధునిక సమీకృత భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి, మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుంది. గత ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా మండలాలు విభజించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త మండలాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి రెవెన్యూ సేవలను బలోపేతం చేశాం. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతుంది. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి సామాన్యుడికి గౌరవప్రదమైన పాలన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.