మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ ఉత్సాహం, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు.
– ఉదయం నుంచే ఓటర్ల రద్దీ.
– మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డిలో ఘర్షణలు.
– దొంగ ఓట్ల యత్నాలు అడ్డుకున్న సిబ్బంది.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 11:
తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 116 స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండగా, ఎన్నికల సంఘం మరియు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కువ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నమోదయ్యాయి. సదాశివపేటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న అభ్యర్థిని ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ 25వ డివిజన్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. 19వ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అనుమతి ఇచ్చి తనను అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించగా, ఇరు పార్టీల అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నినాదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాకాసిపేట్ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులను దొంగ ఓట్లు వేయకుండా సిబ్బంది అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 నెంబరు బూత్ల వద్ద తోపులాటలు చోటుచేసుకున్నాయి. 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా, చెలరేగిన ఘటనలను పోలీసులు అదుపులోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.