ధరలు ఆకాశానికి…జీతాలు నేలకే !
– ధరల మంటలో జీతాల నిశ్శబ్దం.
– విత్యవసరాల పెరుగుదల.
– జీతాల స్థిరత్వం.
– ఈఎంఐ–చిట్టీల భారం.
– పేద–మధ్యతరగతి జీవన సంక్షోభం.
జనం వాయిస్, డెస్క్, జనవరి 02:
దేశంలో విత్యవసర ధరలు నియంత్రణ తప్పుతున్నాయి. బియ్యం, పప్పులు, వంటనూనె, కూరగాయలు, పాలు, గ్యాస్, విద్యుత్ వంటి నిత్యావసరాలు సామాన్యుడి చేతికి అందని స్థాయికి చేరుతున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటేనే భయం కలిగే పరిస్థితి నెలకొంది. రోజువారీ ఖర్చులు పెరుగుతుంటే కుటుంబ బడ్జెట్ పూర్తిగా తారుమారవుతోంది.
ఇంతటి ధరల పెరుగుదల మధ్య కూడా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. ప్రైవేట్ రంగంలో జీతాలు సంవత్సరాలుగా అదే స్థాయిలో నిలిచిపోయాయి.

ప్రభుత్వ ఉద్యోగులకూ పెరిగిన ఖర్చులకు తగినంత ఉపశమనం లభించడం లేదు. ఆదాయం ఒకటే ఉండగా ఖర్చులు పెరిగిపోవడంతో జీవనం రోజురోజుకూ కష్టంగా మారుతోంది.
దీనికి తోడు ఇంటి రుణాలు, విద్యా రుణాలు, వాహన ఈఎంఐలు, చిట్టీల కట్టుబాట్లు నెలనెలా తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తోంది. జీతం చేతికొచ్చేలోపే ఈఎంఐలు, బకాయిలకే ఎక్కువ మొత్తం ఖర్చవుతోంది. మిగిలిన డబ్బుతో నెలంతా కుటుంబాన్ని నడపడం అసాధ్యంగా మారుతోంది. చిన్న అవసరాలకైనా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పిల్లల చదువు, వైద్యం వంటి మౌలిక అవసరాలే ఇప్పుడు భారంగా మారాయి. ఒక చిన్న అనారోగ్యమే వేల రూపాయల ఖర్చుగా మారుతోంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలన్న ఆలోచన పూర్తిగా కనుమరుగవుతోంది. ఒకప్పుడు నెలాఖరు వరకు ప్లాన్ చేసుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలు… ఇప్పుడు నెల మధ్యకే ఆర్థికంగా కుంగిపోతున్నాయి.
ధరల నియంత్రణ లేకుండా, ఆదాయ భద్రత కల్పించకుండా సామాన్యుడి జీవితం ఎలా మెరుగుపడుతుంది?
పేద–మధ్యతరగతి కుటుంబాల ఈ వేదనను పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు?
జీవించడమే భారంగా మారిన ఈ పరిస్థితికి పరిష్కారం ఎప్పుడు వస్తుంది?
