రైతుల సమస్యలను గాలికి వదిలేసిన మంత్రి శ్రీధర్ బాబు.
-నష్ట పోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి.
-సర్కారు వైఫల్యం కారణంగానే రైతులకు తీవ్ర నష్టం.
-తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జనం వాయిస్, మంథని:
భారీ వర్షాలు వరదలతో ఈ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. మంథని పట్టణంలో స్వర్గీయ గిట్ల జనార్దన్ రెడ్డి స్మారక వ్యవసాయ మార్కెట్ కమిటి లో దాదాపు 15 రోజుల క్రితం రైతులు ధాన్యాన్ని విక్రయం తీసుకు వచ్చినప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం చేయక పోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్థానిక ఏఎంసీ మార్కెట్ యార్డులో తడిచిన వరి ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల కష్టాలపై కనీస అవగాహన లేని వ్యక్తులకు ఓటు ద్వారా మనం అధికారం కట్టబెడితే ఇలాంటి నష్టాలనే చూడాల్సిన పరిస్థితులుంటాయి. మంథని నియోజకవర్గ ప్రజల ఓట్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ఎమ్మెల్యే మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ తను, తన కుటుంబ సభ్యుల లాభం కోసమే పని చేస్తున్నాడే తప్ప ఏనాడు ఈ ప్రాంత ప్రజల కష్టాలపై ఆలోచన చేసిన పాపాన పోలేదని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మంథని ఎమ్మెల్యేకు మాత్రమే వర్థిస్తుందన్నారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మంథని ఏఎంసీ మార్కెట్ యార్డేనన్నారు. రైతులు ఇక్కడ వరి ధాన్యం పోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదన్నారు. కనీసం రైతులకు వరి ధాన్యం తడవకుండా ఉండేలా టార్ఫాలిన్లు కూడ అందించక పోవడం బాధకరమన్నారు. కొంత మంది రైతులకు చిరిగి పోయి, చిల్లులున్న టార్ఫాలిన్లు అందించారని ఇది వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏఎంసీ మార్కెట్ యార్డులో దాదాపు నెల రోజుల క్రితం పాడి డ్రైయర్ మిషన్ తీసుకు వచ్చి ఇంకా వినియోగం లోకి తేలేదు అంటే వీళ్లకు రైతులపై ఎంత చిత్తశుద్ధి ఉందో అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. ఇప్పటికైనా పాలకవర్గం సభ్యులు, అధికారులు స్పందించి వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, తడిచిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో తాము తీవ్ర ఆందోళన కార్యక్రమాలను చేసేందుకు కూడ వెనుకాడబోమని స్పష్టం చేశారు.