వేసవిలో వానల సందడి… తెలంగాణకు రెయిన్ అలర్ట్ – పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు భగ్గుమంటున్నా… మరోవైపు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయి. ఈ అకాల వర్షాలు ప్రజలకు వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, రైతులు మాత్రం పండిన పంటలు దెబ్బతింటాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న నాలుగైదు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
మే 4 (సోమవారం) రోజున జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.