బల్దియా ఎన్నికల్లో రెబెల్స్ టెన్షన్.
– ప్రధాన పార్టీల్లో మొదలైన టెన్షన్.
– బుజ్జగింపులు ఫలించకపోవడంతో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం.
– పార్టీలో సీనియర్ లను తప్పించి .. జుంపింగ్ అభ్యర్థులకు కేటాయింపులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తెలంగాణలో ఎక్కడ చూసిన పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. పురపోరులో అసమ్మతి సెగలు మాత్రం ఆరడం లేదు. నామినేషన్ల ముందు నుంచి పలు పార్టీలు చేస్తున్న బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచి(రెబల్స్) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చాలా వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులతో ఇబ్బందికర పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల హెచ్చరికలు ఫలించకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. వారి కారణంగా పలుచోట్ల తమ గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉందని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి మొదలైన వివాదాలు, నామినేషన్ల ఉపసంహరణ నాటికి తారాస్థాయికి చేరుకున్నాయి. పలుచోట్ల బీ-ఫాంలు చేతికందని ఆశావాహూలు తమ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల ఇవి తారస్థాయికి చేరి ఆత్మహత్యలు చేసుకుంటామనే స్థాయి వరకు వెళ్లింది. వివిధ సమీకరణలు, అభ్యర్థులకున్న పట్టును అంచనావేసి బీ-ఫాంలను ఇచ్చారు. టికెట్ రానివారిలో చాలామంది అప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగడం, ఎన్నికల షెడ్యూల్ నుంచి వార్డుల్లో పర్యటిస్తూ పోటీలో ఉంటామని ప్రజలను కలవడంతో నామినేషన్ల ఉపసంహరణలకు వారు ససేమిరా అన్నారు.