డిసెంబర్ 31న తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు.
జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01:
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఆ రోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు జనంతో కిక్కిరిసిపోయాయి. నగరాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా మందుబాబుల సందడి కనిపించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాత్రంతా మద్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది నూతన సంవత్సరం వేడుకలతో పోలిస్తే ఈసారి అమ్మకాలు మరింత పెరిగాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.1000 కోట్ల మేర అదనపు అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి జరిగిన మొత్తం అమ్మకాల పూర్తి లెక్కలు ఇంకా వెలువడాల్సి ఉంది. అవి బయటకు వస్తే ఈసారి మద్యం విక్రయాలు ఆల్టైం రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల అమలులోకి వచ్చిన మద్యం విధాన మార్పులే ఈ భారీ అమ్మకాలకు ప్రధాన కారణమని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.